JP నడ్డాకు ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కు శంషాబాద్ ఎయిర్ పోర్టు లో బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు. హన్మకొండ బీజేపీ బహిరంగ సభలో పాల్గొనేందుకు నడ్డా తెలంగాణకు రావడం జరిగింది. కాసేపట్లో ప్రత్యేక విమానంలో వరంగల్ కు జెపి నడ్డా వెళ్లనున్నారు. 3 గంటల 45 నిమిషాలకు హన్మకొండ బాలసముద్రంలో.. తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ వెంకటనారాయణ ఇంటికి.. జేపీ నడ్డా వెళ్లనున్నారు. నడ్డాతో పాటు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉండనున్నారు. సభ తర్వాత రాత్రి ఏడున్నరకు శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు నడ్డా చేరుకుంటారు. అక్కడ సినీ హీరో నితిన్.. జేపీ నడ్డాను కలవనున్నారు.

ఇదిలా ఉంటె నడ్డా పర్యటన నేపథ్యంలో టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు చేశారు. ” నేడు జేపీ నడ్డా చెప్పులు మోసే గులాం ఎవరు” అంటూ ట్విట్టర్ వేదికగా ఓ ప్రశ్న వేశారు. దీనికి తీవ్రమైన పోటీ ఉంటుందని కచ్చితంగా చెబుతున్నానని వ్యంగ్యంగా ట్విట్ చేశారు.

ఇటీవల మునుగోడులో బిజెపి బహిరంగ సభ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని కేంద్ర మంత్రి అమిత్ షా బయటకు రాగానే.. బండి సంజయ్, అమిత్ షా చెప్పులను చేతులతో తెచ్చి కాళ్ళ ముందు పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై టిఆర్ఎస్ నేతలు ఓ రేంజ్ లో కామెంట్స్ చేయగా..ఈరోజు నడ్డా పర్యటన నేపథ్యంలో కేటీఆర్ ఎద్దేవా చేసారు.