ఈ నెల 31న మునుగోడులో ప్రచారానికి రానున్న జేపీ నడ్డా

bjp-national-president-jp-nadda-will-attend-the-public-meeting-to-be-held-on-31st-of-this-month-in-munugodu-

హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం పార్టీ ముఖ్య నేతలు కూడా బరిలోకి దిగుతున్నారు. తాజాగా.. మునుగోడు ప్రచారానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. 31 న మునుగోడులో జరిగే బిజెపి బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. బహిరంగ సభలో కీలక ప్రకటన ఉంటుందనే చర్చ వేగంగా వ్యాపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం హోరెత్తుతోంది. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 31న మునుగోడులో జరిగే బిజెపి సభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారంటూ ఆ పార్టీ తెలంగాణ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అయితే మునుగోడు ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షానే ఈ సభకు రప్పించే దిశగా చర్యలు చేపట్టారు. అయితే అమిత్ షా షెడ్యూల్ సహకరించని కారణంగా జేపీ నడ్డా వస్తున్నారు. ఇక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో మునుగోడులో ప్రలోభాల పర్వం మొదలైంది. పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్, బిజెపి మధ్య టఫ్ ఫైట్ కొనసాగనుందనే అంచనాల నేపథ్యంలో ఆ రెండు పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

మరోవైపు.. ఈ నెల 30 న మునుగోడు ప్రచారానికి సీఎం కేసీఆర్ రానున్నారని తెలుస్తోంది. ఆ రోజు చండూరులో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత రోజే జేపీ నడ్డా రానుండటంతో మునుగోడు ఉపఎన్నికల హీట్ మరింత పెరిగే అవకాశముంది.