భద్రతను తొలగించుకున్న ఎంపి బండి సంజయ్

Bandi Sanjay
Bandi Sanjay

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కు చెందిన బిజెపి ఎంపి బండి సంజయ్ తన వ్యక్తిగత భద్రతను ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా తనకు ఉన్న ప్రత్యేక భద్రతను సైతం ఉపసంహరించుకున్నారు. తన భద్రతా సిబ్బందిని వెనక్కి పంపివేశారు. కాగా, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయనపై ఇటీవల రాళ్ల దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించారు. అయితే, బండి సంజయ్ పై రాళ్ల దాడి జరగలేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వదంతి వ్యాపించిందని, రాళ్ల దాడి ఘటన అబద్ధమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ తన ప్రత్యేక భద్రతను వాపస్ పంపినట్టు సమాచారం. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఏ ప్రజాప్రతినిధిపైనా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడా రాళ్ల దాడులు, భౌతిక దాడులు జరగలేదని చెప్పారు. ఒకవేళ అలాంటి దాడులు జరిగివుంటే వెంటనే తాము స్పందించేవారమని అన్నారు. ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించారని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/