మీరే మీ కుటుంబంతో కలిసి విందుకు రండి
ప్రియాంకకు బిజెపి ఎంపి అనిల్ బులానీ పిలుపు
న్యూఢిల్లీ: బిజెపి రాజ్యసభ సభ్యుడు అనిల్ బులానీని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తేనీటి విందుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై అనిల్ బులానీ స్పందించారు. ప్రస్తుతం తాను కేన్సర్కు చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చానని, కాబట్టి తాను టీ తాగేందుకు రాలేనని, మీరే కుటుంబంతో కలిసి మా ఇంటికి విందుకు రావాలని ఆహ్వానించారు. విందులో ఉత్తరాఖండ్ సంప్రదాయ వంటకాలను వండిపెడతానని హామీ ఇచ్చారు.
ప్రియాంక గాంధీ 1997 నుంచి ఢిల్లీలోని 35 లోధీ ఎస్టేట్ బంగళాలోనే ఉంటున్నారు. ఆమెకు కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను కేంద్రం ఇటీవల ఉపసంహరించుకుంది. దీంతో బంగళాను ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు నోటీసులు పంపింది. దీంతో ఆగస్టు 1 నాటికి ప్రియాంక బంగళాను ఖాళీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాను ఖాళీ చేయబోతున్న బంగళాలోకి రాబోతున్న అనిల్ బులానీని ప్రియాంక తేనీటి విందుకు ఆహ్వానించారు. భార్యతో కలిసి టీ తాగేందుకు రావాలని కోరారు. ఈనేపథ్యంలోనే ఢిల్లీలోని లుటియెన్స్ బంగళాలోకి మారిన తర్వాత విందు ఇస్తానని బులానీ పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/