మరోసారి హైకోర్టులో ఎమ్మెల్యే రాజాసింగ్‌ భార్య పిటిషన్

జైలులో నా భర్తకు ప్రత్యేక వసతులను కల్పించండి..

rajasingh
rajasingh

హైదరాబాద్ః జైలులో వున్న గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తరఫున ఆయన భార్య ఉషాబాయి మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు రాజా సింగ్ పై నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ ఆమె ఇప్పటికే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె గురువారం మరో పిటిషన్ దాఖలు చేశారు. జైలులో తోటి ఖైదీల నుంచి తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని… ఈ నేపథ్యంలో తన భర్తకు ప్రత్యేక వసతులకు అవకాశం కల్పించాలని ఆమె తన పిటిషన్ లో హైకోర్టును కోరారు.

జైలులో ఇతర ఖైదీలకు దూరంగా తన భర్తకు ఓ గదిని కేటాయించాలని ఉషాబాయి హైకోర్టును కోరారు. ప్రత్యేక గదితో పాటు అందులో మంచం, టేబుల్, కుర్చీ, వార్తా పత్రికలు, టీవీ, వంట చేసుకోవడానికి తగిన వసతులు కల్పించాలని ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై గురువారమే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. తమ వాదనలు వినిపించేందుకు తమకు మరింత సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంతో విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/