తెలంగాణ లో వచ్చేది బిజెపి ప్రభుత్వమే – అమిత్ షా

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో బిజెపి విజయం సాదిస్తుందని , ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేసారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రముఖ నేషనల్ మీడియా ఛానెల్ టైమ్స్ నౌ నిర్వహించిన సమ్మిట్‌లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో బీజేపీ గాలి విస్తోందని, కిందస్థాయి వరకు తనకు ప్రజల నాడి తెలుసంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను నేరుగా వెళ్లి అక్కడే ఉంటానని, బీజేపీని గెలిపిస్తానంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఖచ్చితంగా మార్పు వస్తుందని, బీజేపీ సౌత్ ఎంట్రీకి తెలంగాణ గేట్ వే అంటూ అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల నాడి తనకు బాగా తెలుసని, తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పనిసరిగా గెలుస్తుందని జోస్యం చెప్పారు.

అత్యధిక సీట్లతో గెలిచి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పోరు కొనసాగిస్తుండటం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో బీజేపీ నేతలను చిక్కుల్లో పడేసిన క్రమంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకుని బలపడాలని చూస్తోంది. వీలైనంతమంది నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది.