మన సైనికులను రాహుల్ అగౌరవపరిచారుః బిజెపి ఫైర్

చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే భారత్ నిద్రపోతోందన్న రాహుల్

bjp-demands-congress-to-terminate-rahul-from-party

న్యూఢిల్లీః అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత సైనికులను చైనా సైనికులు కొడుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. మన సైన్యం శక్తిసామర్థ్యాలను కించపరిచేలా మాట్లాడిన రాహుల్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రిమోట్ కంట్రోల్ నేత కాకపోతే తక్షణమే రాహుల్ పై వేటు వేయాలని డిమాండ్ చేశారు. దేశంపై గౌరవం ఉంటే ఈ పని చేయాలని అన్నారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్ లో కొనసాగుతోంది. నిన్న జైపూర్ లో రాహుల్ మాట్లాడుతూ.. ఒకవైపు చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే… కేంద్ర ప్రభుత్వం దీన్ని గ్రహించకుండా నిద్రపోతోందని విమర్శించారు. చైనా సైనికులతో భారత సైనికులు దెబ్బలు తింటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో గౌరవ్ భాటియా మాట్లాడుతూ… రాహుల్ కు వ్యతిరేకంగా మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకోకపోతే… రాహుల్ గాంధీనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా తాము భావిస్తామని, ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వ్యాఖ్యలుగా పరిగణిస్తామని చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/