అరవింద్ కేజ్రీవాల్‌ను చంపడానికి బిజెపి కుట్ర : మనీశ్‌ సిసోడియా

BJP Conspiring “To Kill Arvind Kejriwal”, Role For Leader Manoj Tiwari: AAP

న్యూఢిల్లీః ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బిజెపి కుట్ర పన్నుతోందని ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కీలక ఆరోపణలు చేశారు. ఈ కుట్రలో బిజెపి ఎంపీ మనోజ్‌ తివారీ ప్రమేయం ఉందన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గుజరాత్‌ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమి భయంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బిజెపి కుట్రపన్నుతోంది. ఈ కుట్రలో బిజెపి ఎంపీ మనోజ్‌ తివారీ ప్రమేయముంది. కేజ్రీవాల్‌పై దాడి చేయాలని తమ గూండాలను ఆయన బహిరంగంగానే పురిగొల్పుతున్నారు. ఈ చౌకబారు రాజకీయాలకు మా పార్టీ(ఆప్‌) భయపడబోదు. బిజెపి గూండాయిజానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’ అని స్పష్టంచేశారు.

ఇటీవల కేజ్రీవాల్‌ భద్రత గురించి బిజెపి ఎంపీ మనోజ్‌ తివారీ పలు వ్యాఖ్యలు చేశారు. ‘అంతులేకుండా కొనసాగుతన్న అవినీతి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకోవడం, జైల్లో ఆప్‌ మంత్రికి మసాజులు వంటి పరిణామాల పట్ల ఆప్‌ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ భద్రతపై నాకు ఆందోళనగా ఉంది. ఇప్పటికే ఆప్‌ ఎమ్మెల్యేలను చితకబాదిన ఘటనలు కూడా చూశాం. ఇలాంటి అనుభవం ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎదురు కాకూడదని కోరుకుంటున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. తివారీ వ్యాఖ్యలపై తాజాగా మనీశ్‌ సిసోడియా పై విధంగా స్పందించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/