గోదావరి గర్జన పేరుతో రాజమండ్రిలో భారీ బహిరంగ సభ

ఆత్మకూరు ఉప ఎన్నికలో బరిలోకి దిగుతున్నామన్న సోము వీర్రాజు

అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన గోదావరి గర్జన పేరుతో రాజమండ్రిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని తెలిపారు.

నవరత్నాల పేరుతో వైస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం కంటే… రాష్ట్రానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమమే ఎక్కువని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఇళ్లను కేటాయిస్తే… రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40 వేల ఇళ్లను మాత్రమే నిర్మించిందని విమర్శించారు. కోనసీమలో అల్లర్లు కేవలం ఓట్ల రాజకీయాల కోసమే జరుగుతున్నాయని చెప్పారు.

కాగా, ఆత్మకూరు ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంటోంది. వైస్సార్సీపీ తరపున దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/