నోరు తెరిస్తే కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారు : సంజయ్
ఉద్యోగాల భర్తీ విషయంలో రోజుకో మాట చెబుతున్నారని విమర్శ
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసిఆర్ పై మండిపడ్డారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నోరు తెరిస్తే కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రోజుకో మాట చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ కేబినెట్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. అలాగే, తెలంగాణకు మహిళా గవర్నర్ ఉన్నారని, ఆమెకు గౌరవం ఇవ్వాలని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రజాకార్ల కాలంలో మహిళలు ఎలా భయపడేవారో అటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని అన్నారు. టీఆర్ఎస్ నేతలు వస్తుంటే మహిళలు భయంతో ఇంట్లో నుంచి బయటకు రావట్లేదని చెప్పారు. మహిళలపై టీఆర్ఎస్ నేతలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితులకు కారణం ఎవరని ఆయన నిలదీశారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన విమర్శలు గుప్పించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/