దౌర్జన్యపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది
151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ఆర్సిపి కి ఈ ఎన్నికలంటే భయమెందుకో?
విజయవాడ: జనసేన అధినేత పవన కల్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి దౌర్జన్యాలపై మండిపడ్డారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి బిజెపి, జనసేన ఉమ్మడిగా రూపొందించిన విజన్ డాక్యుమెంట్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. 2014, 2019లో టిడిపి ఎన్నికలు నిర్వహించలేదని, ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి , ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని విమర్శించారు. ‘స్థానికగ’ ఎన్నికలు నిర్వహించకుండా నాడు టిడిపి ప్రభుత్వం వ్యవహరిస్తే, నేడు దౌర్జన్యపూరితంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలకు.. ముఖ్యంగా ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని విమర్శించారు.
‘క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్’ జనసేన, బిజెపి లు సంపూర్ణంగా నిరసిస్తున్నాయని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో యువతకు, కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో తాము ముందుకు వెళ్తుంటే, నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చిత్తూరు సహా కొన్ని జిల్లాల్లో అయితే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయాలంటే భయపడే పరిస్థితి కల్పించారని ధ్వజమెత్తారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ఆర్సిపి కి ఈ ఎన్నికలంటే ఎందుకు భయపడుతోంది? దౌర్జన్యంగా ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? అని ప్రశ్నించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/