కచ్చితంగా భారత్‌ వైపు చూడాల్సిందే..బిల్‌గేట్స్‌

సింగపూర్ ఫిన్ టెక్ ఫెస్టివల్ లో బిల్ గేట్స్

Bill-Gates-praises-Indias-digital-finance-policies

సింగపూర్‌: భారత్‌పై మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ అండ్ మిలిందా ఫౌండేషన్ చీఫ్ బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. వినూత్న ఆర్థిక విధానాలను అవలంబించడంలో భారత్ మిగతా దేశాల కన్నా ఎంతో ముందు నిలిచిందని, అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను భారత్ చక్కగా వినియోగిస్తోందని అన్నారు. ‘ప్రపంచ దేశాల్లోని ఎవరైనా చైనాను వదిలేసి, మరో దేశంపై అధ్యయనం చేయాలని భావిస్తే, వారంతా కచ్చితంగా ఇండియావైపే చూడాలి’ అని సింగపూర్ లో జరుగుతున్న ఫిన్ టెక్ ఫెస్టివల్ లో వర్చ్యువల్ విధానంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యానించారు.

డిజిటల్ పేమెంట్స్, అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రపంచంలోని అతిపెద్ద బయో మెట్రిక్ డేటా బేస్ ఇప్పటికే ఇండియాలో సిద్ధమైందని, డబ్బు బట్వాడా బ్యాంకుల ద్వారా కాకుండా, స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా జరుగుతుండటం కూడా శరవేగంగా విస్తరిస్తోందని గేట్స్ గుర్తు చేశారు. పేదలకు సంక్షేమ పథకాలను దగ్గర చేయడంలోనూ టెక్నాలజీని ఇండియా ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయని అన్నారు.

2016లో పెద్ద నోట్ల రద్దు తరువాత భారత్ లో డిజిటల్ చెల్లింపులు ఎంతో పెరిగాయని, అవినీతిని పారద్రోలేందుకు ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం, దేశం మొత్తాన్ని నగదు రహితంగా మార్చేందుకు సహకరించిందని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ సేవలు విస్తరించాయని ఆయన అన్నారు. వైర్ లెస్ డేటా రేట్లు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉన్నది ఇండియాలోనేనని గుర్తు చేసిన బిల్ గేట్స్, స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా భారత్ లో చౌకగా ఉన్నాయని, దీంతో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు కనిపిస్తున్నాయని అన్నారు.

ఫేస్ బుక్, అమెజాన్, వాల్ మార్ట్, పేటీఎం సహా అన్ని కంపెనీలూ తమ సేవలకు యూపీఐ ప్లాట్ ఫామ్ ను వాడటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిందని బిల్ గేట్స్ కితాబిచ్చారు. ఇదే తరహా వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో ఎన్నో దేశాలు విఫలమయ్యాయని అన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/