‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్.. మోడీకి బిల్గేట్స్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలతో మమేకం కావలనే ఉద్దేశంతో ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రతీ నెల చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ రేడియో ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడంతో పాటు.. దేశంలో పలువురు ప్రముఖుల గురించి, ప్రదేశాల గురించి, సామాన్యుల విజయాల గురించి ప్రస్తావిస్తుంటారు ప్రధాని. ఈ నేపథ్యంలోనే.. ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమంపై ప్రజల్లోనూ ఆసక్తి పెరిగింది. ప్రతి నెల చివరి ఆదివారం నాడు ప్రధాని ఏ విషయం గురించి మాట్లాడుతారా? అని దేశమంతా ఎదురు చూస్తుంటుందనడంలో ఏమాత్రం సంశయం లేదు.
ఈ క్రమంలోనే ప్రధాని మోడీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ను ఉద్దేశించి ప్రపంచ కుబేరుడు బిల్గేట్స్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘మన్ కీ బాత్.. పారిశుధ్యం, ఆరోగ్యం, మహిళల ఆర్థిక సాధికారత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో ముడిపడి ఉన్న ఇతర సమస్యలపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించింది.’ అని బిల్గేట్స్ పేర్కొన్నారు. కాగా, ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం తాజాగా 100వ ఎపిసోడ్కు చేరువైంది. ఏప్రిల్ 30వ తేదీన జరిగే ఎపిసోడ్తో 100వ ఎపిసోడ్ పూర్తవనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రూ.100 కాయిన్ను విడుదల చేయనున్నారు. అలాగే, అనేక అంశాలపై కీలక ప్రసంగం చేయనున్నారు.