ఢిల్లీ లో మరోసారి నిరసనలు తెలుపుతున్న అన్నదాతలు

అన్నదాతలు మరోసారి నిరసన బాట పట్టారు. నిరుద్యోగ సమస్య, తమ మునుపటి సమస్యల పరిష్కారం కోసం జంతర్‌మంతర్ వద్ద అన్నదాతలు శాంతియుత ఆందోళనలు మొదలుపెట్టారు. నిరుద్యోగ సమస్య, తమ మునుపటి సమస్యల పరిష్కారం కోసం జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తోన్న మహా పంచాయత్‌లో పాల్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి వందల మంది అన్నదాతలు దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

అన్నదాతల ఆందోళనల దృష్ట్యా దిల్లీలో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. గాజీపూర్, సింఘూ, టిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి.. ఢిల్లీ లోకి వస్తున్న అన్ని వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. గాజీపూర్‌ సరిహద్దుల్లో దిల్లీ-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై నిఘాను పటిష్ఠం చేశారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. ఆందోళనల్లో పాల్గొనకుండా రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం ఢిల్లీ కి వస్తున్న రాకేశ్‌ను గాజీపూర్‌ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకుని మధువిహార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.