వైట్హౌజ్లో మోడీ, బైడెన్ జోకులు
భారత్లో బైడెన్ పేరుతో ఐదుగురు ఉన్నారన్న జో బైడెన్
వారంతా జో బైడెన్ బంధువులేనంటూ మోడీ జోక్
వాషింటన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని నరేంద్ర మోడీ .. వైట్హౌజ్ భేటీలో జోకులేసుకున్నారు. ‘మీ దేశంలో ఐదుగురు బైడెన్లు ఉన్నారు’.. అంటూ ప్రధాని మోడీ తో జో బైడెన్ అన్నారు. బైడెన్ అనే పేర్లు పలువురికి ఇంటి పేర్లుగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. దీనిపై మోడీ స్పందిస్తూ అందుకు సంబంధించి కొన్ని పత్రాలను తీసుకొచ్చానని, భారత్లో బైడెన్ పేరుతో ఉన్న వారంతా జో బైడెన్ బంధువులేనని జోక్ వేశారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వారు.
అమెరికాలో 1972లో తాను తొలిసారి సెనెటర్గా ఎన్నికైన సమయంలో భారత్లోని ముంబై నుంచి తనకు ఓ వ్యక్తి లేఖ రాశాడని చెప్పారు. ఆయన ఇంటి పేరు బైడెన్ అని పేర్కొన్నాడని అన్నారు. అంతేగాక, తాను అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో ముంబై వచ్చిన సమయంలో కొందరు పాత్రికేయులు ఇదే విషయాన్ని తన వద్ద ప్రస్తావించారని తెలిపారు. ఆ తర్వాతి రోజు భారత్లో ఐదుగురు బైడెన్లు ఉన్నారని మీడియాలో వచ్చిందని గుర్తు చేసుకున్నారు. తాను వారి గురించి ఎన్నడూ వివరాలు తెలుసుకోలేదని, మోడీ తో సమావేశమైన నేపథ్యంలో ఆ వివరాలు తెలుస్తాయేమో అని సరదాగా అన్నారు.
కాగా, నిన్నటి సమావేశంలో మోడీ , జో బైడెన్ ఇరు దేశాలకు సంబంధించిన అంశాలతో పాటు ఆఫ్ఘనిస్థాన్, ఇండో-పసిఫిక్ వంటి అంశాలపై చర్చలు జరిపారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/