అసెంబ్లీ ఘటనపై ఫస్ట్ టైం స్పందించిన నారా భువనేశ్వరి

వారం రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ లో చంద్రబాబు , ఆయన భార్య భువనేశ్వరి ఫై వైసీపీ నేతలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఫై చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం..ఆ తర్వాత తెలుగుదేశం నేతలు , కార్యకర్తలు , నందమూరి ఫ్యామిలీ సభ్యులు వైసీపీ నేతల తీరును తప్పుపట్టడం జరిగింది. ఈ ఘటన ఫై ఫస్ట్ టైం నారా భువనేశ్వరి స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు భువనేశ్వరి తెలిపారు. ‘నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి తమ అమ్మగారు, నాన్నగారు తమను విలువలతో పెంచారని గుర్తు చేశారు. నేటికీ తాము వాటిని పాటిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.

విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కష్టాల్లో, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలని పేర్కొన్నారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదన్నారు. తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.