భోల‌క్‌పూర్ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు నగర ప్రజలను భయాందోళకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అగ్ని ప్రమాద వార్త వినిపిస్తూనే ఉంది. ఈరోజు శనివారం రాత్రి ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధి భోల‌క్‌పూర్ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో మంట‌లు అంటుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. చిన్న గల్లీలో ప్లాస్టిక్ స్క్రాప్ గోదాం ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిప‌డుతున్నాయి.

అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంటనే మూడు ఫైర్ ఇంజిన్ల‌తో సంఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లినప్పటికీ..గల్లీ చిన్న గా ఉండడం తో లోనికి పోవడం కుదరలేదు. దీంతో దూరం నుండే మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంటలు పెద్దవి కావడం తో ఆ చుట్టూ పక్కల ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. గోదాంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. ఇక ఈరోజు మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులో కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్‌సర్య్కూట్‌తో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. కానీ.. భారీగా అస్తినష్టం వాటిల్లింది.