భారత్‌ బయోటెక్‌ కీలక నిర్ణయం

రెండో దశ క్లినికల్ ట్రయల్స్ సంఖ్యను సగానికి సగం తగ్గించిన భారత్ బయోటెక్

corona -vaccine

న్యూఢిల్లీ: కరోనా నివారణ కోసం దేశీయ సంస్థ భారత్‌ బయోటెక్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)తో కలసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీకి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు వీలుగా భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను త్వరగా ముగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను సగానికి సగం తగ్గించనుంది. వాస్తవానికి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను 750 మంది వలంటీర్లపై నిర్వహించాల్సి ఉండగా, ఇప్పుడా సంఖ్యను 380కి కుదించారు! వ్యాక్సిన్ ప్రయోగాలు జరిగే ప్రదేశాల సంఖ్యను కూడా తగ్గించారు.

కొన్నిరోజుల్లోనే రెండో దశను ముగించి, ఆపై మూడో దశ ప్రయోగాలను వెంటనే చేపట్టాలన్నది భారత్ బయోటెక్ ప్రణాళిక. తద్వారా సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ప్రయోగాలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతి ఇచ్చింది. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ఇప్పటివరకు మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్టు తెలుస్తోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/