జీవితా రాజశేఖర్ దంపతులకు బండ్ల గణేష్ కౌంటర్

జీవితా రాజశేఖర్ దంపతులకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం బిజెపి లో కొనసాగుతున్న జీవిత రాజశేఖర్ దంపతులు..రీసెంట్ గా బండి సంజయ్ దీక్ష లో పాల్గొని కేసీఆర్ ఫ్యామిలీ ఫై విమర్శలు కురిపించారు. హైదరాబాద్‌లోని పబ్‌ల్లో మంత్రి కేటీఆర్‌కు వాటాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు జీవిత. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటోందని, తెలంగాణ రాక ముందుకు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత?… ఇప్పుడు ఎంత ఉన్నాయో చెప్పే ధైర్యం ఉందా? అని నిలదీశారు. లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున కల్వకుంట్ల తెలంగాణ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

కాగా ఈమె వ్యాఖ్యలకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ‘లక్ష్మీపార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నారు. మన రాష్ట్రంలో పార్టీ జెండాలు ఎన్ని ఉన్నాయో అన్ని జెండాలు మెడలో వేసుకున్నారు ఆదర్శ దంపతులు. ఇంకా సీపీఎం, సీపీఐ, ఎంఐఎం మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా చేరి బ్యాలెన్స్ చేయండి అక్కా’ అంటూ సెటైర్ వేశాడు. అంతేకాకుండా జీవిత, రాజశేఖర్ దంపతులు వివిధ పార్టీల్లో చేరిన సందర్భాల్లోని ఫొటోలను సైతం షేర్ చేశాడు. ఇంకా జనసేన పార్టీ కూడా మిగిలి ఉందని కామెంట్ చేయడంతో.. దండం ఎమోజీతో వద్దు అనే విధంగా బండ్ల రిప్లే ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.