ఆగస్టు 2 నుండి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర..

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్టు 2 నుండి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టబోతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. మూడో విడతలో బండి సంజయ్ 20 రోజుల పాటు పాదయాత్ర చేస్తారని చెప్పుకొచ్చారు. రెండు విడతల పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ 67 రోజుల్లో 828 కిలోమీటర్లు నడిచారు. 28 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు తరుణ్ చుగ్ తెలిపారు.

అలాగే ఈ నెల 21 నుంచి పల్లె గోస – బీజేపీ భరోసా పేరుతో యాత్ర చేపట్టనున్నట్లు తరుణ్ ప్రకటించారు. బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. నేతలు బైక్ ర్యాలీలు నిర్వహించి పల్లెల్లో సమస్యలు తెలుసుకుంటారని, ప్రతి నియోజకవర్గానికి ఒక ముఖ్య నేత వెళ్లేలా ప్లాన్ చేశామని తరుణ్ చుగ్ అన్నారు. వారంతా నియోజకవర్గంలో 10 రోజుల పాటు మకాం వేస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు పల్లె గోస – బీజేపీ భరోసా యాత్రం ఉంటుందని చెప్పారు. మొదటి విడతలో 30 నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించనున్నట్లు తరుణ్ చుగ్ ప్రకటించారు. జిల్లాలవారీగా చేరికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్ ను నియమించిన అనంతరం తొలిసారి ఈ సమావేశం జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకునేలా కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఈ భేటీలో ఎంపీ అర్వింద్ తో పాటు ఎమ్మెల్యే రఘునందన్, కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.