న్యాయవాదుల హత్యపై పూర్తి విచారణ జ‌ర‌పాలి

న్యాయ‌వాదుల హ‌త్య కేసులో నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేసి చేతులు దులుపు‌కోవ‌ద్దు.. బ‌ండి సంజ‌య్

హైదరాబాద్‌: హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద కొంద‌రు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వామన్‌రావు తల్లిదండ్రులను బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆ పార్టీ నేత‌లు ప‌లువురు పరామర్శించారు.

ఈ సంద‌ర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ‌ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది ప్రభుత్వ హత్యేనని ఆయ‌న‌ ఆరోపించారు. పథకం ప్రకారమే న్యాయ‌వాద‌ దంపతులను చంపేశార‌ని, ఈ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయ‌న హెచ్చ‌రించారు. పూర్తి విచార‌ణ‌‌ పూర్తయిన అనంత‌ర‌మే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ హత్యల‌ వెనుక ఎవరున్నారన్న విష‌యం తెలిసిన అనంత‌ర‌మే చర్యలు తీసుకోవాల‌ని చెప్పారు. ఈ హ‌త్యల‌ ఘ‌ట‌న‌పై వెంటనే సిఎం కెసిఆర్‌ స్పందించాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. టిఆర్‌ఎస్‌ నేతలు దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిల‌దీశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/