పీఆర్ఎస్ అని పేరు పెట్టుకొని KA పాల్ తో తిరుగు – కేసీఆర్ కు బండి సంజయ్ కౌంటర్

తెలంగాణ ముఖ్యమంత్రి ఫై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసి కేసీఆర్ దేశాన్ని పట్టుకుని తిరుగుతున్నాడని, కేసీఆర్ బీఆర్ఎస్ కాదు.. ప్రపంచ రాష్ట్ర సమితి (పీఆర్ఎస్) పెట్టుకుని కేఏ పాల్ తో కలిసి తిరిగినా ఎలాంటి సమస్య లేదని బండి సంజయ్ అన్నారు. హైదరాబాదును పాకిస్తాన్లో కలపాలని చూసిన వారి సమాధి ముందు మోకరిల్లిన దుర్మార్గుడు కేసీఆర్.. ‘కాశీం చంద్రశేఖర్ రజ్వి’ అంటూ మండిపడ్డారు. రాష్ట్ర పోలీసులను అవమానపరిచే విధంగా అస్సాం సీఎం విషయంలో టిఆర్ఎస్ వ్యవహరించిందన్నారు.

నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ మొదలుపెడుతున్న సందర్భంగా కుత్బుల్లాపూర్ లో ఏర్పాటుచేసిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముగ్గురి కబంధ హస్తాలలో బందీ అయి రోదిస్తున్న తెలంగాణ తల్లికి విముక్తి కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టామని సంజయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ను న్యూయార్క్, సింగపూర్ స్థాయిలో అభివృద్ధి చేస్తానన్న సీఎం కేసీఆర్.. అది ఎక్కడైందో చూపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. చిన్న వర్షం కురిస్తే హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు. సిటీలో గుంత చూపిస్తే వెయ్యి ఇస్తానన్నా కేసీఆర్ కు.. సిటీలో ఉన్న గుంతలను చూపిస్తే ఇవ్వడానికి రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదన్నారు.

పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, రైతుల రుణమాఫీ చేయాలని ప్రశ్నిస్తే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 సంవత్సరాలు అయినా డ్రైనేజీలను మార్చలేదని.. ‘జీడిమెట్ల నీళ్లు పంపుతా కేసిఆర్ స్నానం చెయ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినం పేరుతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 30 గ్రామాల కరెంటుని కెసిఆర్ తన ఫామ్ హౌస్ లోకి వాడుకున్నాడని ఆరోపించారు. రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసి కేసీఆర్ దేశాన్ని పట్టుకుని తిరుగుతున్నాడని, కేసీఆర్ బీఆర్ఎస్ కాదు.. ప్రపంచ రాష్ట్ర సమితి (పీఆర్ఎస్) పెట్టుకుని కేఏ పాల్ తో కలిసి తిరిగినా ఎలాంటి సమస్య లేదని బండి సంజయ్ అన్నారు. తనకు 102 డిగ్రీల జ్వరమున్నా ప్రజా సంగ్రామ యాత్రలో పాల్లొన్నానని, కార్యకర్తలే తనకు స్ఫూర్తిప్రదాతలని చెప్పారు.