ఉప ఎన్నికలో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటూ బండి సంజయ్ డిమాండ్

ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గం లో ఎన్నో సంక్షేమ పధకాలు తీసుకొచ్చారు. వాటిలో ప్రధానమైంది దళిత బంధు. ఎన్నికల సమయంలో కొంతమందికి ఈ పధకం అందజేసి ఆ తర్వాత ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆపేసారు. ఇక ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో తెరాస ఓటమి చెందడం తో దళిత బంధు అమలు చేస్తారో లేదో అనే అనుమానం కలుగుతుంది. అయితే ఉప ఎన్నికల సమయంలో ఏ ఏ హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయాలనీ బండి సంజయ్ డిమాండ్ చేసారు.

కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ… ఎన్నికల కోడ్ సాకుగా చూపి.. కేసీఆర్ దళిత బంధు ఆపేశారని..ఉప ఎన్నికి సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ రేపటి నుంచి సీఎం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారన్నారు బండి సంజయ్. ఓటుకు రూ.6 వేల చొప్పున పంపిణీ చేశారని ఆరోపించారు. ధన ప్రలోభాలతో గెలవాలని చూశారని..అయితే టీఆర్ఎస్ అబద్ధాలను,జిమ్మిక్కులను ప్రజలు నమ్మలేదన్నారు. హుజురాబాద్ ప్రజలకు ఈటల అండగా ఉన్న వ్యక్తి అని..మంత్రిగా, ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఈటల గెలవడం సంతోషంగా ఉందన్నారు.