రాహుల్ వ్యాఖ్యలపై ఆజాద్, సిబల్ అసంతృప్తి
బిజెపి ఏజెంట్లం కాదు…వెంటనే రాజీనామా చేస్తా

న్యూఢిల్లీ: సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు రాసిన లేఖపై వాడీవేడీగా చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా భేటీలో కలకలం రేగింది. అసమ్మతి నేతలు బిజెపి ఏజెంట్లంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కపిల్ సిబల్, గులాంనబీ ఆజాద్ రాహుల్కు ఘాటు సమాధానాలిచ్చారు.
రాహుల్ ఆరోపించినట్లు ఒకవేళ తాను బిజెపి ఏజెంట్నే అయితే, తాను వెంటనే రాజీనామా చేసేసి బయటికి వెళ్లిపోతానని ఆజాద్ అన్నారు. సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహార శైలి బాగోలేకపోవడంతోనే తాము లేఖ రాశామని చెప్పారు.
తాము బిజెపితో కుమ్మక్కయ్యామని అనడం ఏంటంటూ కపిల్ సిబాల్ కూడా ట్విట్టర్ లో రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాజస్థాన్ హైకోర్టులో విజయవంతంగా వాదించి కాంగ్రెస్ను కాపాడామని, మణిపూర్లో బిజెపిని దించి కాంగ్రెస్ను రక్షించామని, తాను 30 ఏళ్లలో బిజెపికి అనుకూలంగా ఒక్క ప్రకటనైనా చేయడం చూశారా? అని ప్రశ్నించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/