అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఖరారైన ముహూర్తం
14 జనవరి 2024 రోజున ఆలయంలో రాముడి విగ్రహం..
న్యూఢిల్లీః అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 2024 లోపు రాముని విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. డిసెంబర్ 2023 నాటికి ఆలయం (రామ మందిరం) గ్రౌండ్ ఫ్లోర్ సిద్ధమవుతుందని, ఆ తర్వాత 15 రోజులకు అంటే.. 14 జనవరి 2024 రోజున ఆలయంలో రాముడి విగ్రహం ప్రతిష్టించబడుతుందని ఇటీవల జరిగిన రామమందిర నిర్మాణ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే ఈ రామాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండగా… 2023 చివరి నాటికి పనులు పూర్తి చేయనున్నారు.
ఈ రామాలయం నిర్మాణానికి రూ. 1800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరి చంపత్రాయ్ పేర్కొన్నారు. 2023 డిసెంబర్ వరకు నిర్మాణం పనులు పూర్తవుతాయని, 2024 జనవరిలో సంక్రాంతి పర్వదినం రోజున రామాలయంలో శ్రీరాముడి విగ్రహన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చంపత్రాయ్ వెల్లడించారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం రామాలయంలోకి భక్తులను అనుమతిస్తామని అన్నారు. కాగా, అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి ఆగస్టు 5, 2020న ప్రధాని మోడీ భూమి పూజను నిర్వహించిన విషయం తెలిసిందే.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/