ఇస్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ..

ఎన్ని జాగ్రత్తలు పాటించనప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరగడం..ప్రాణాలు పోవడం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పఠాన్ చెరు మండల పరిధిలోని హైవేపై.. ఇస్నాపూర్ వద్ద అతివేగంతో వెళుతున్న ఆటో అదుపుతప్పి రోడ్డు అవతలివైపు వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. కాగా ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదంపై వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన ముగ్గురిని, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ప్రమాద సమయంలో రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మరొకరికి గాయాలు అయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పఠాన్ చెరు పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సమీక్షించారు. మృతుల్లో ఇద్దరు పఠాన్ చెరులోని తోషిబా కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న తిరుమలవాసు(34), ఆటో డ్రైవర్ సాయి బన్నన్(27),గా గుర్తించిన పోలీసులు మరొకరి వివరాలు సేకరిస్తున్నారు.