రెండో వ‌న్డేలో 10 వికెట్ల తేడాతో టీం ఇండియా ఫై ఆస్ట్రేలియా ఘన విజయం

విశాఖ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా – ఇండియా మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో ఇండియా ఫై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ కాగా… ఆసీస్ 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేక ఉసూరుమనిపించారు. ఓపెన‌ర్లు మిచెల్ మార్ష్‌(66) ట్రావిస్ హెడ్ (51) అర్ధ శ‌త‌కాల‌తో చెల‌రేగారు. వీళ్లిద్ద‌రూ టీ20 త‌ర‌హాలో బ్యాటింగ్ చేయ‌డంతో ఆసీస్ మ‌రో 234 బంతులు ఉండ‌గానే టార్గెట్‌ను ఛేదించింది.

తొలి వ‌న్డేలో గెలిచి ఊపు మీదున్న భార‌త్‌కు షాక్. రెండో వ‌న్డేలో విజ‌యం సాధించి సిరీస్ వ‌శం చేసుకోవాల‌నుకున్న టీమిండియా ఆశ‌ల‌పై ఆసీస్ నీళ్లు చ‌ల్లింది. మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో ట్రావిస్ హెడ్ కూడా అర్ధసెంచరీ సాధించాడు. హెడ్ 30 బంతుల్లో 10 ఫోర్లు బాది 51 పరుగులు నమోదు చేశాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను ఆసీస్ 1-1తో సమం చేసింది. ఇక చివరిదైన మూడో వన్డే ఈనెల 22న చెన్నైలో జరగనుంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ టీమిండియా 117 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. స్వ‌దేశంలో మూడో అత్య‌ల్ప స్కోర్ న‌మోదు చేసింది. పిచ్ పేస్‌కు అనుకూలించడంతో ఆ జ‌ట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చెల‌రేగిపోయాడు. అత‌ని ధాటికి టాపార్డ‌ర్ కుప్ప‌కూలింది.