జనసేన పార్టీ కి రూ.25 లక్షల విరాళం అందించిన ఆస్ట్రేలియా జనసేన బృందం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసాయాత్ర కు రూ.25 లక్షల విరాళం అందించిన ఆస్ట్రేలియా జనసేన బృందం. ఆస్ట్రేలియా జనసేన ప్రతినిధులు పప్పుల జ్ఞానేశ్వరరావు, వఝుల పవన్ కిశోర్, పులిపాటి రామ్, గాజుల మురహరి, సింగంశెట్టి పవన్ కుమార్ ఈరోజు బుధువారం పవన్ కల్యాణ్ ను హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కలిశారు. ఆయనకు విరాళాల తాలూకు చెక్ ను అందజేశారు.

ఈ సందర్భంగా పవన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలన్న సదుద్దేశంతో అందించిన ఈ సాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ డబ్బును రైతు కుటుంబాలకు చేరేలా, రైతుల పిల్లల చదువులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఎన్నారైల ఆహ్వానం మేరకు త్వరలోనే తగిన సమయం చూసుకుని ఆస్ట్రేలియాలో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.