ఓవైసీ ప్ర‌యాణిస్తున్న వందేభార‌త్ రైలుపై దాడి

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్ నుంచి సూరత్ నగరానికి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న అసదుద్దీన్ ఒవైసీపై గుర్తుతెలియని దుండగులు రాళ్ల దాడి చేసారు. ఓవైసీ కూర్చున్న బోగీపై రాళ్లు రువ్వ‌డంతో ఆ బోగీలోని అద్దాలు ప‌గిలాయి. ఈ విష‌యాన్ని ఆ పార్టీ నేత వారిస్ ప‌ఠాన్ తెలిపారు. త‌న ట్విట్ట‌ర్‌లో ఆయ‌న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను పోస్టు చేశారు. సూర‌త్‌కు 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

‘‘నేను అసదుద్దీన్ పక్కన కూర్చొని రైలులో ప్రయాణిస్తుండగా రాయి దాడికి రైలు అద్దం పగిలింది, మరో నిమిషంలో మరో రాయి అసద్ ప్రయాణిస్తున్న రైలు బోగీపై ఆగంతకులు విసిరారు’’ అని వారిస్ పఠాన్ చెప్పారు. తమపై రాళ్ల వర్షం కురిపించినా, అగ్ని వర్షం కురిపించినా తాము మాత్రం హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంటామని వారిస్ పఠాన్ తెలిపారు.