ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్‌ రెడ్డి గెలుపు

అంత ఊహించినట్లే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి భారీ మెజార్టీ తో విజయడంఖా మోగించారు. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్‌ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. లక్ష్య ఫై చిలుకుతో విక్రమ్ గెలుస్తాడని వైసీపీ శ్రేణులు భావించారు. కానీ మెజారిటీ లక్ష దాటలేదు. 82,888 ఓట్ల మెజారిటీకే పరిమితం అయింది వైసీపీ. దీంతో వైసీపీ నేతల్లో నిరాశ నెలకొంది. ఆశించిన విజయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌.. విక్రమ్‌ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ‍్వలేదు. ఇక, పోస్టల్‌ బాలెట్‌లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్‌సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్‌ ఓట్లలోనూ వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యం సాధించింది.

ఉప ఎన్నిక ఫలితాలపై బిజెపి పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ స్పందించారు. వైస్సార్సీపీ భారీగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందనిఆగ్రహం వ్యక్తం చేసారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్…మంత్రులతో సమావేశమై ఎన్నికల్లో మెజారిటీ పై సూచనలిచ్చారని పేర్కొన్నారు. మంత్రులు..ఎమ్.ఎల్.ఏ.లు వచ్చినా వారికి ఆశించిన మెజారిటీ రాలేదన్నారు. వాలంటీర్లు..ఆశ వర్కర్లుతో డబ్బులు పంచారని పైర్‌ అయ్యారు. నైతికంగా విజయం మాదేనని బి.జె.పి. పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ చెప్పారు.