వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్..ఇక బడితపూజే అంటూ అచ్చెన్నా ఫైర్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు..వైసీపీ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారం ఉందని బరితెగిస్తే.. బడితపూజే అంటూ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుమ్మలపాలెంలో తెలుగుదేశం పార్టీ మహిళా సర్పంచ్ మల్లేశ్వరి ఇంటిపై జరిగిన దాడిని అచ్చెన్నా తీవ్రంగా ఖండించారు. మహిళా హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకర్గంలోనే మహిళా ప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. అధికారం ఉందని మహిళల పట్ల బరి తెగిస్తే వ్యవహరిస్తే.. భవిష్యత్‌లో అదే మహిళల చేత బడితపూజ ఖాయమన్నారు.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళలను బూతులు తిడుతున్నారని.. గ్రామాల్లో మహిళలపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందని.. ఇక వారి అరాచకాలు సాగవని అచ్చెన్నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు