వైసీపీ సర్కార్ కు అచ్చెన్న సవాల్..

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు..వైసీపీ సర్కార్ కు సవాల్ విసిరారు. ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికలో అచ్చెన్న మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని.. ఉత్తరాంధ్రను వైసీపీ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందని విమర్శలు చేసారు. జగన్ పాలనలో ఉత్తరాంధ్రకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని.. వైసీపీ ఎంపీలు విశాఖ రైల్వేజోన్‌పై ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు.

ఉత్తరాంద్ర ప్రాంతానికి టీడీపీ ఏం చేసిందో చెబుతామని.. వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలరా అన్నారు. అభివృద్ధి చేయలేకే జ‌గ‌న్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆయన విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర ప్రాంత‌ సమస్యలను ఈ ప్రాంత మంత్రులు జగన్‌ వద్ద ప్రస్తావించగలరా? అని అచ్చెన్నాయుడు నిల‌దీశారు. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌పై గతంలో ఆ పార్టీ నేత‌లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.