కేంద్ర ప్రభుత్వంపై అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రజలను గాలికి వదిలేశారు

asaduddin-owaisi

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ధ్వజమెత్తారు. ఈసారి కరోనా అంశం ఆధారంగా విమర్శనాస్త్రాలు సంధించారు. రోజువారీ రిపోర్టుల్లో పేర్కొంటున్న గణాంకాల కంటే క్షేత్రస్థాయిలో కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ అధ్యయనం చెబుతోందని వెల్లడించారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా కరోనా కేసులను లెక్కల్లో చూపలేదని ఆరోపించారు.

కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఒవైసీ విమర్శించారు. సంక్షోభ సమయంలో ప్రజలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. చికిత్స అందించే విషయం అటుంచితే, కనీసం కరోనా కేసులను లెక్కించడంలోనూ ఏమాత్రం జాగ్రత్త చూపలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐసీఎంఆర్ సీరో సర్వే (మే నెల) రిపోర్టును కూడా పంచుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/