మా సంతోషానికి కొలమానం ఏంటన్న అసద్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందన

asaduddin-owaisi

హైదరాబాద్‌: ప్రపంచంలో అనేక ముస్లిం సమాజాలు ఉన్నాయని, అయితే వాటన్నింటిలోకెల్లా భారత్ లో ఉన్న ముస్లింలే అత్యంత సంతృప్తికర జీవనం గడుపుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘మా సంతోషానికి కొలమానం ఏమిటి?’ అని ప్రశ్నించారు. ‘దేశంలోని మెజారిటీ వర్గానికి మేం ఎంత కృతజ్ఞులమై ఉండాలో భగవత్ అనే పేరు గల ఈ వ్యక్తి అదేపనిగా చెబుతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కింద మేం గౌరవించబడినప్పుడే మాకు సంతోషం. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మీ సిద్ధాంతాలు చిత్రీకరిస్తున్న నేపథ్యంలో మా సంతోషం గురించి మీరు మాట్లాడొద్దు. మా సొంతగడ్డపై మేం జీవించేందుకు కూడా మెజారిటీ ప్రజల పట్ల ఒదిగి ఉండాలన్న మాటలను మీ నుంచి మేం వినదలుచుకోలేదు. మెజారిటీ వర్గం నుంచి మేం ప్రాపకాన్ని కోరుకోవడంలేదు. మేమే అత్యంత సంతోషంగా ఉన్న ముస్లిం ప్రజలమంటూ ప్రపంచ ముస్లింలతో మేం పోటీపడడంలేదు. మా ప్రాథమిక హక్కులు మాక్కావాలంటున్నాం అని తమ అభిప్రాయాలు వెల్లడించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/