అమిత్ షా పర్యటనకు కోల్కతాలో నిరసన సెగ
హోంమంత్రి పదవి నుంచి అమిత్ షా తప్పుకోవాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్
కోల్కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు చేరుకున్నారు. అయితే వారి రాకకు వ్యతిరేకిస్తూ నలుపు బెలూన్లతో వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కేంద్రానిదే బాధ్యత అని, హోమంత్రి పదవి నుంచి అమిత్ షా తప్పుకోవాలంటూ నినాదాలు చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాలు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ సమీపానికి చేరుకున్నారు. అమిత్ షా ఎయిర్పోర్టుకు చేరకున్నారన్న విషయం తెలియగానే నలుపు బెలూన్లు ఆకాశం వైపు ఎగురవేసి, అమిత్ షా గోబ్యాక్ అంటూ ఫ్లకార్డులతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక్క వామపక్ష పార్టీలే కాకుండా ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, రాజకీయేతర సంఘాలు అన్ని నిరసనలో పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఢిల్లీ అల్లర్లకు కారణం బీజేపీయేనని, మతతత్వంతో చేలరేగిన అల్లర్లకు అగ్గి రాజేసింది అమిత్ షాయేనని వారు ఆరోపించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/