కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, గణేషుడి రూపాలు.. ప్రధానికి కేజ్రీవాల్ లేఖ
న్యూఢిల్లీ: దేశ ఆర్ధికాభివృద్ధి కోసం కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, గణేషుడి రూపాలు ముద్రించాలని కేజ్రీవాల్ రెండు రోజుల కిందట ప్రధాని మోడీ కి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. కరెన్సీ నోట్లపై మహాత్మ గాంధీ ఫొటోలతో పాటు దేవతా రూపాలు ఉంచాలని తాను చేసిన అభ్యర్ధనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ నిర్ణయం సత్వరం అమలు చేయాలని 130 కోట్ల మంది తరపున ప్రధానికి విజ్ఞప్తి చేశానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ప్రధానికి రాసిన లేఖను కేజ్రీవాల్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారత ఆర్ధిక వ్యవస్ధ గడ్డుకాలం ఎదుర్కొంటోందని లేఖలో కేజ్రీవాల్ ప్రస్తావించారు. ఈ పరిస్ధితుల్లో ఓవైపు దేశ ప్రజలు కష్టపడి పనిచేయాలని, మరోవైపు దేవతల ఆశీస్సులు మెండుగా ఉంటేనే మనం సత్ఫలితాలు సాధిస్తామని ఆయన రాసుకొచ్చారు.
కాగా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో హిందూ వ్యతిరేక ముద్రను తొలగించుకునేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ఇక రాజ్యాంగంలో నిర్ధేశించిన లౌకిక విధానాలను ఉల్లంఘించిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.