ఓటుతో పంజాబ్ ప్రజలు విప్లవం సృష్టించారు : అరవింద్ కేజ్రీవాల్
93 స్థానాల్లో ఆప్ ఘనవిజయం
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించడం పై ట్విట్టర్ లో స్పందించారు. పంజాబ్ ప్రజలు ఓటుతో విప్లవం సృష్టించారంటూ వారికి తన అభినందనలు తెలిపారు. పంజాబ్ లో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మాన్ తో కలిసి విక్టరీ సింబల్ చూపిస్తున్న ఫొటోను కూడా కేజ్రీ పంచుకున్నారు. ఎన్నికల ఫలితాల సరళి స్పష్టమైన దశకు చేరుకోగానే, కేజ్రీవాల్ ఢిల్లీలో హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. పంజాబ్ లో తమ పార్టీ ఘనవిజయంపై దేవుడి ఆశీస్సులు అందుకున్నారు.
పంజాబ్ అసెంబ్లీలో 117 స్థానాలు ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ 57 స్థానాల్లో గెలిచి, మరో 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. 9 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ, మరో 9 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం, ఏమాత్రం ఛరిష్మా లేని చరణ్ జిత్ చన్నీని కాంగ్రెస్ హైకమాండ్ సీఎంని చేయడం, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆధిపత్యం కోసం ప్రయత్నించడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బకొట్టాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/