గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం
ప్రేమను అంగీకరించని కారణంతో యువతి తల్లిని చంపేందుకు యత్నం

గుంటూరు: జిల్లాలో ఆర్మీ జవాన్ కాల్పులు జరపడం కలకలం రేపింది. జిల్లాలోని చెరుకుపల్లి మండలం నడింపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రమాదేవి అనే మహిళపై ఆర్మీ జవాన్ బాలాజీ కాల్పులు జరిపాడు. రమాదేవి కూతురిని ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా బాలాజీ వెంటపడుతున్నాడు. అయితే ఇందుకు రమాదేవి ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న బాలాజీ… ఉదయం ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి కాల్పులు జరిపాడు. నాటు తుపాకీ కాల్పులు జరిపి రమాదేవిని చంపేందుకు యత్నించాడు. అయితే అతడి ఘాతుకాన్ని ముందుగానే పసిగట్టిన మహిళ… ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే ఈ ఘటనలో ఆమె కుడి చెవికి బుల్లెట్ గాయమైంది. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో బాలాజీ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడికి సహకరించిన ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసిన పోలీసులు… ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/