తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి

బుధువారం మధ్యాహ్నం 12 : 20 సమయంలో తమిళనాడు కూనూరు సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్ తో పాటు మరో 12 మంది మృతి చెందారు. ఈ 12 మంది లో చిత్తూరు జిల్లా వాసి కూడా ఉన్నారు.

చిత్తూరు జిల్లా కురబలకోట ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా సాయితేజ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదంలో అతడు కూడా మృతి చెందాడు . సాయితేజ 1994లో జన్మించారు. 2013లో ఆర్మీలో చేరారు. సాయితేజకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లల చదువుల కోసం నివాసాన్ని మదనపల్లికి మార్చారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం కూడా సాయితేజ తన భార్యతో ఫోన్లో మాట్లాడినట్లు సాయి బాబాయ్ సుదర్శన్ తెలిపారు. సాయి మరణం పట్ల ఆ గ్రామంలో విషాదం నెలకొంది.