పార్లమెంట్ కోరితే పీఓకేను వెనక్కి తేస్తాం
ఆపరేషన్ పీఓకే నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే వెనక్కి తెచ్చుకోవాలని పార్లమెంట్ కోరితే ఆ ప్రాంతాన్ని వెనక్కి తేస్తామని భారత కొత్త ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవనే అన్నారు. నెలవారీ ప్రెస్మీట్లో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరవనే మాట్లాడారు. పీఓకే మనదేనని ఆపరేషన్ పీఓకే నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ మేరకు తమకు ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఉత్తర్వులు అందితే అప్పుడు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని నరవనే స్పష్టం చేశారు. ఎల్ఓసి వద్ద పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల నుంచి ఎదురవుతున్న ముప్పును ఆర్మీ చీఫ్ ప్రస్తావిస్తూ ఎల్ఓసీ వెంబడి అత్యంత అప్రమత్తత పాటిస్తున్నామన్నారు. ప్రతిరోజు ఇంటెలిజెన్స్ అలెర్ట్లు అందుతుంటాయని, చాలా సీరియస్గానే వీటిని పరిగణించి పాకిస్థాన్ ప్రత్యేక బలగాలైన బ్యాట్ చర్యలకు ప్రతి చర్యలు చేపడుతూ వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతుంటామని చెప్పారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/