ఏపీ ప్ర‌భుత్వానికి మ‌రో షాక్.. 6న ఆర్టీసీ స‌మ్మె

45 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చిన జేఏసీ నేతలు


అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఇప్పుడు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఎన్ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, కార్మిక పరిషత్, ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సహా 12 సంఘాలతో కూడిన జేఏసీ నేతలు మొత్తం 45 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నిన్న విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో ఎండీ ద్వారకా తిరుమలరావుకు అందించారు. సమస్యలను పరిష్కరించకుంటే ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేపడతామని తెలిపారు.

స్పందించిన ఎండీ ద్వారకా తిరుమలరావు.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పీఆర్సీ ఇస్తుందో ఇంకా తెలియకముందే సమ్మెలోకి వెళ్లడం సరికాదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని ఈ సందర్భంగా కోరారు. అయితే, సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మరోవైపు, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఉద్యమానికి మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగుల్లోనూ పీఆర్సీ సాధన సమితి ఏర్పడింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసిన టీటీడీ సాధన సమితి రేపటి ‘చలో విజయవాడ’లో పాల్గొనాలని నిర్ణయించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/