అగ్నికి ఆహుతైన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు..

ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైన ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. పరవాడ మండలం వాడచీపురుపల్లి నుంచి 50 మంది ప్రయాణికులతో ఓ బస్సు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బయలుదేరింది. జ్ఞానాపురం కాన్వెంట్ కూడలి వంతెనపైకి రాగానే బస్సు వెనక చక్రం నుంచి పొగలు వచ్చాయి. దీనిని గమనించిన కండక్టర్ ఆ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పి అప్రమత్తం చేశాడు. డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందికి దింపి పోలీసులకు సమాచారం అందించాడు.

ప్రయాణికులు కిందికి దిగిన క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సును చుట్టుముట్టాయి. అదే సమయంలో అటుగా గ్యాస్ సిలిండర్ల లారీ రావడంతో అక్కడే ఉన్న హోంగార్డు దానిని దూరంగా నిలిపివేశాడు. ఆ తర్వాత క్షణాల్లోనే బస్సు అగ్నికీలల్లో చిక్కుకుని కాలి బూడిదైంది. మరోవైపు, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం నుండి బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.