దాడుల‌కు పాల్ప‌డ్డ వారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి

పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తుండ‌డం శోచ‌నీయం: అచ్చెన్నాయుడు

అమరావతి: ఏపీ పోలీసులు, వైస్సార్సీపీ నేత‌ల‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. టీడీపీ శ్రేణుల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో దారుణ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తుండ‌డం శోచ‌నీయ‌మ‌ని ఆయ‌న చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైస్సార్సీపీ దాడులు పెరిగిపోయాయని, దాడులకు స‌హ‌క‌రించిన‌ ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.

అధికారం ఉంది క‌దా అని దారుణాల‌కు పాల్పడితే భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా ప్రతిఫలం అనుభవిస్తార‌ని ఆయ‌న చెప్పారు. గుంటూరు జిల్లాలోని కొప్పర్రులో త‌మ పార్టీ నాయ‌కురాలు శారద ఇంటిపై దాడి చేశార‌ని ఆయ‌న అన్నారు. ఇల్లు, బైక్‌లు తగులబెట్టారని, ఆ ప్రాంతంలో పోలీసులు ఉన్నప్ప‌టికీ ప్రేక్షకపాత్ర వహించారని ఆయ‌న ఆరోపించారు.

టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఇంత జ‌రుగుతున్న‌ప్ప‌టికీ పోలీసులు ఏం చేస్తున్నారని ఆయ‌న నిల‌దీశారు. దాడులు జరుగుతున్నందుకే ఏపీ పోలీసులకు అవార్డులు వ‌స్తున్నాయా? అని చుర‌కంటించారు. దాడుల‌కు పాల్ప‌డ్డ వారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాల‌ని, లేదంటే ఏపీ వ్యాప్తంగా నిర‌స‌న‌లు తెలుపుతామ‌ని ఆయ‌న హెచ్చరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/