దేవాలయాలకు శంకుస్థాపన చేసినా..జగన్ ను ప్రజలు నమ్మరు..
ఎపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
Amaravati: ఆలయాలలపై వరుసగా దాడులపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆలయాల పునర్నిర్మాణం అంటూ సీఎం జగన్ డ్రామాలాడుతున్నారని టిడిపి ఎపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు..
కృష్ణా పుష్కరాల సమయంలో రోడ్డు వెడల్పు కోసం గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో తొలగించిన 9 గుడుల పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి జగన్ భూమిపూజను నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.
అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచిన తర్వాత శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ దేవాలయాలను మళ్లీ నిర్మిస్తామంటే ఆయనను ఎవరైనా కాదంటారా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై హిందూ సమాజం మొత్తం ఆగ్రహంగా ఉంది కాబట్టే జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
రాష్ట్రంలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతుంటే ఇంత వరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదని అచ్చెన్న మండిపడ్డారు.
ఈ దాడులన్నీ ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగాయని, దేవాలయాలకు జగన్ శంకుస్థాపన చేసినా, ఆయనను ఎవరూ నమ్మరని అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/