జాబ్​ క్యాలెండర్​ పై నిరుద్యోగుల భారీ ర్యాలీ

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల నిరసనలు

అమరావతి: ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. రోడ్లపై మానవహారాలు కట్టి.. పలు చోట్ల కలెక్టరేట్ల ముట్టడించారు. జాబ్ క్యాలెండర్ బోగస్ అని, తక్షణమే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని విలీనం చేసి 59 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఎలా చెబుతారంటూ మండిపడ్డారు. గౌరవవేతనం కింద పనిచేసే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారని నిలదీశారు.

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ముందు నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం కోట క్రాస్ రోడ్స్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు మానవ హారం కట్టారు. తర్వాత కలెక్టరేట్ కు భారీ ర్యాలీ తీశారు. జాబ్ క్యాలెండర్ తో ఏమాత్రం లాభం లేదన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కర్నూల్ కలెక్టరేట్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ బాలేదంటూ గుంటూరులో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/