విశాఖ బంద్‌లో పాల్గొన్న ఏపీ మంత్రులు, నేత‌లు

ప్రైవేటీక‌ర‌ణ చ‌ర్య‌లను మానుకోవాల‌ని డిమాండ్

విశాఖపట్నం: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణ‌యానికి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ పిలుపు మేరకు బంద్ నిర్వ‌హిస్తున్నారు. విశాఖ‌లోని మ‌ద్దిల‌పాలెం వ‌ద్ద వైస్సార్సీపీ నేత‌లు ఆందోళనకు దిగారు.

మంత్రులు క‌న్న‌బాబు, అవంతి శ్రీనివాస్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తో పాటు ప‌లువురు నేత‌లు నిర‌స‌న‌లో పాల్గొన్నారు. ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేటీక‌ర‌ణ చ‌ర్య‌లను మానుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మద్దిలపాలెం జంక్షన్‌లో మానవహారం నిర్వహించారు. విశాఖలో స్వచ్ఛందంగా వ్యాపార కార్య‌క‌లాపాల‌ను మూసివేశారు. ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో వామపక్ష పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు నిరసనలు జ‌రుపుతున్నాయి.

మ‌రోవైపు, రాష్ట్ర బంద్‌కు అమ‌రావ‌తి రైతులు కూడా మ‌ద్ద‌తు తెలిపారు. అమ‌రావ‌తిలో దుకాణాలు, ఇత‌ర కార్య‌క‌లాపాల‌ను స్వ‌చ్ఛందంగా మూసేశారు. బ‌స్సులను ముందుకు క‌ద‌ల‌నివ్వ‌ట్లేదు.

తాజా బిజినెస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/