ప‌వ‌న్ రీల్ హీరో మాత్ర‌మే, రియ‌ల్ హీరో కాలేరు : మంత్రి రోజా

వైఎస్సార్ యంత్ర సేవా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన జ‌గన్‌

అమరావతి : ఏపీ లో నేడు సీఎం జ‌గ‌న్ వైఎస్సార్ యంత్ర సేవా కార్య‌క్ర‌మాన్నికి గుంటూరు జిల్లాలో శ్రీకారం చుట్ట‌గా…మంత్రి రోజా త‌న సొంత నియోజ‌కవ‌ర్గం న‌గ‌రి నుంచి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాదిరే ఉత్సాహంగా ట్రాక్ట‌ర్ ఎక్కిన రోజా స్వ‌యంగా ట్రాక్ట‌ర్ న‌డిపారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధుల‌తో ఆమె మాట్లాడుతూ… టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ లపై పంచ్‌లు విసిరారు. టీడీపీ, జ‌న‌సేన‌తో పాటు ఎన్ని పార్టీలు గుంపులు గుంపులుగా వ‌చ్చినా జ‌గ‌న్ అనే సింహం సింగిల్‌గానే వ‌స్తుంద‌ని ఆమె చెప్పారు.

ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే ఆలోచన ఉందా? లేదంటే ప‌ద‌వులే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకున్నారా? అన్న విష‌యంపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు చంద్రబాబు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె చెప్పారు. చంద్ర‌బాబు ఎప్పుడూ ఒంట‌రిగా పోరాటం చేసే నేత కాద‌ని, నిత్యం ఆయ‌న పొత్తుల‌తోనే ముందుకు సాగుతున్నార‌న్నారు. రియ‌ల్ లైఫ్‌లో రియ‌ల్ హీరో జ‌గ‌నేన‌ని చెప్పిన రోజా.. ప‌వ‌న్ రీల్ హీరో మాత్ర‌మేన‌ని, ఆయ‌న రియ‌ల్ హీరో కాలేర‌ని తేల్చి చెప్పారు. ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా వార్ వ‌న్ సైడ్ అన్న‌ట్లుగానే ఉంటుంద‌ని రోజా చెప్పుకొచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/