వినియోగదారుల కోసం టోల్ ఫ్రీ నెంబర్లుః మంత్రి కారుమూరి

గ్రామ సచివాలయంలోనూ ఫిర్యాదు చేయవచ్చన్న మంత్రి

అమరావతిః ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరరావు వినియోగదారుల హక్కుల చట్టంపై స్పందించారు. వినియోగదారుల హక్కుల చట్టంలో కొన్ని మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. కల్తీ వస్తువులు, సమస్యలపై న్యాయ పరిష్కారానికి ఈ మార్పులు దోహదపడతాయని భావిస్తున్నామని తెలిపారు. వినియోగదారుల సమస్యలపై ఇక మీదట గ్రామసచివాలయంలోనూ ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. వినియోగదారుల కోసం 1967, 1800 425 0082 టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు.

మంత్రి కారుమూరి అటు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు తీవ్ర అసహనంతో మాట్లాడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలవలేమన్న కోపంతో దారుణంగా తిడుతున్నాడని అన్నారు. జగన్ పార్టీలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నారని, ప్రజలు జగన్ ను తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని తెలిపారు. దేశంలో అక్షరాస్యత పరంగా కేరళ మొదటిస్థానంలో ఉంటే, ఏపీ రెండో స్థానంలో ఉందని, ఇలా అన్ని విధాలా రాష్ట్రం ముందుకు పోతోందని అన్నారు. ఇవన్నీ చూసి ఆ ముసలి నక్కో, కుక్కో ద్వేషంతో రగిలిపోతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/