నాతో నడవమనండి..పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరిన మంత్రి ధర్మాన
సినిమా వేరు, రాజకీయం వేరు అంటూ వ్యాఖ్యలు
అమరావతిః జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఏపి మంత్రి ధర్మాన ప్రసాదరావు సవాల్ విసిరారు. తనకు ఇప్పుడు 64 ఏళ్లని, పవన్ తనతో పాటు నడవగలరా? అన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని పవన్ గ్రహించాలని ధర్మాన సూచించారు.
“సినిమాలో బొమ్మలతో యాక్షన్ చేస్తారు. పవన్ నడుస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చేశారు. నాతో నడవమనండి… కనీసం 3 కిలోమీటర్లు కూడా నడవలేరు. మాటలు చెప్పినంత సులభంగా ఏమీ ప్రజాజీవితం ఉండదు” అని ధర్మాన వ్యాఖ్యానించారు. అధికారం, పదవులు పట్టించుకోకుండా నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామంలో మంత్రి ధర్మాన ‘గడపగడపకు…’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, గ్రామంలో కనిపించిన పవన్ కల్యాణ్ పోస్టర్ లో స్థానిక యువకుల ఫొటోలు కూడా ఉండడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/