ఉపాధ్యాయ సంఘాలతో సమీక్ష నిర్వహించిన మంత్రి బొత్స

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో సమీక్ష నిర్వహించారు. తమ దృష్టికి రాకుండా పెండింగ్‌లో ఉన్న అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకే సమావేశం ఏర్పాటు చేశామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. డీడీఓ అధికారం హెడ్ మాస్టర్లకు ఇస్తున్నట్టు తెలిపారు. జనరల్ ట్రాన్సఫర్లు, టీచర్ల ప్రమోషన్లపైనా చర్చించామన్నారు. రెండో ఎంఈఓ పోస్టులు 680 ఆమోదించడమే కాకుండా.. తాత్కాలికంగా ఏపీఎంలకు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాడు నేడు ద్వారా కొత్త జూనియర్ కాలేజీలకు అన్ని సదుపాయాలు కల్పించడం.. ఇంటర్మీడియట్ బోర్డును ఒకే కమిషనరేట్‌లోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. స్కూలు విద్యను పటిష్ఠం చేయడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

బదిలీలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. 24 గంటల్లో దీనికి సంబంధించి జీవో ఇస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, నక్కా వెంకటేశ్వర్లు. జీరో సర్వీసు బదిలీతో పాటు.. జీతాలు, ఇంక్రిమెంట్లను పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పిందన్నారు ఉపాధ్యాయులు. అలాగే జూనియర్ లెక్చరర్ల నియామకంపై త్వరలో నిర్ణయిస్తామని ఉపాధ్యాయులకు మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఫేస్ రికగ్నిషన్ ద్వారా వేధించడం సరికాదని.. బోధన మీదే ఏకాగ్రత పెట్టేలా చూడాలని ఉపాధ్యాయ నాయకులు మంత్రి బొత్సను కోరారు. అయితే.. ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోని నిర్ణయం తీసుకుంటుందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.